చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారని కొందరు.. లేదు, సొంతంగానే పార్టీ ప్రారంభిస్తారని మరికొందరు రకరకాలుగా ఊహాగానాలు సృష్టిస్తున్న తరుణంలో.. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయప్రస్థానం ఎలా, ఎప్పుడు మొదలుకాబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నియమించిన కారణంగా ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. తమిళనాట బీజేపీ కొత్త తలైవర్ ఎవరన్నది సస్పెన్స్గా మారింది. మొదటి నుంచి బీజేపీకి మద్ధతుగా ప్రకటనలు చేస్తున్న రజనీకాంత్కి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని, ఇందుకు రజనీ కూడా సుముఖంగానే వున్నారని కొన్నిరోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే బీజేపీలో చేరే ఆలోచన రజనీకాంత్కి ఏమాత్రం లేదని, సొంత పార్టీ స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు, 2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రజనీ పావులు కదుపుతున్నారని, సినిమాల్లో బిజీగా వున్నా ఆయన దృష్టంతా పార్టీ స్థాపనపైనే వుందన్నది వారి మాట. దీనిపై రజనీ సన్నిహితుడొకరు మాట్లాడుతూ, బీజేపీ నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదని, ఒకవేళ వచ్చినా ఆ ఆఫర్ను రజనీకాంత్ తిరస్కరించేవారన్నారు. ఆయన కనీసం బీజేపీలో సభ్యుడుగా కూడా లేరని, ఆ పార్టీలో చేరుతారన్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు.
2017, డిసెంబర్ 31న రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేసిన రజనీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని, పార్టీ కూడా ప్రారంభిస్తారని చెప్పారు. రజనీ మక్కల్ మండ్రం స్థాపన వెనుక ఉద్దేశం కూడా అదేనని, ప్రస్తుతం సభ్యుల చేరిక జరగుతోందని, వివిధ స్థాయిల్లో కార్యవర్గ సభ్యుల నియామకాలు కూడా జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకు మక్కల్ మండ్రంలో 60 లక్షల మంది సభ్యులు చేరారని, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న రజనీ సూచన మేరకు పార్టీలో వారికి కూడా పెద్దపీట్ల వేస్తున్నట్టు చెప్పారు. రజనీకాంత్ సినిమా షూటింగ్లో బిజీగా వున్నా వ్యక్తిగతంగా మండ్రం కార్యకలాపాలను పరిశీలిస్తున్నారని, బూత్ లెవల్ కమిటీ నియామకాలను ప్రత్యక్షంగా చూసుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఆవిర్భావ పనులు చురుకుగా సాగుతున్నాయని, బహుశా వచ్చే ఏడాది జనవరిలో రజనీ నుండి ప్రకటన వెలువడవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘దర్బార్’ షూటింగ్లో రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఆ తరువాత దర్శకులు ‘సిరుతై’ శివ, కేఎస్ రవికుమార్ల దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్ టాక్. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టేలోపు రెండు, మూడు సినిమాలు పూర్తి చేయాలన్న ఆలోచనలో రజనీ వున్నట్టు తెలుస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశం గురించి సామాజికవేత్త, రజనీ మద్ధతుదారుడు తమిళరువి మణియన్ స్పందిస్తూ, రజనీ పార్టీకి సంబంధించి అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయని, త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పుని చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా, రజనీ పార్టీ స్థాపిస్తే చేరికలు కూడా భారీగానే వుంటాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేల నుంచి పలువురు నేతలు రజనీ పార్టీ గురించి ఆరా తీస్తున్నారని సమాచారం.
WhatsApp us