కాంగ్రెస్ ప్రముఖ నేత డి.కె.శివకుమార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్లో లభించిన రూ.8.59 కోట్ల నగదు వ్యవహారంలో ఈడీ సమన్లు జారీ చేయడంతో రెండు రోజులుగా ఢిల్లీలోనే ఆయన తీవ్ర స్థాయి విచారణను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఖ్యాతి గడించిన శివకుమార్ను బలహీనపరచడం కోసం కేంద్రం పెద్ద వ్యూహమే పన్నిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2017 ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు దేశ వ్యాప్తంగా 67 చోట్ల ఈడీ జరిపిన దాడుల్లో డి.కె.శివకుమార్ అపార్ట్మెంట్లో బయటపడ్డ కోట్లాది మొత్తం అప్పట్లో సంచలనం సృష్టించింది.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కర్ణాటక కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఖ్యాతి గడించిన డి.కె.శివకుమార్ను బలహీనపరచడానికి రాజకీయంగా కేంద్రం పెద్ద వ్యూహమే పన్నిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందువలన రాష్ట్రంలో రాజకీయంగా ఎంతవరకూ లబ్ధిచేకూరుతుందో తెలి యదుగాని ఆయనపై కేసులను మాత్రం సీరియస్గానే విచారిస్తున్నారు. 2017 ఆగస్టు 2 నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా 67 చోట్ల ఈడీ జరిపిన దాడుల్లో డి.కె.శివకుమార్ అపార్ట్మెంట్లో బయటపడ్డ కోట్లాది మొత్తం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఈ కేసు నత్తనకడన సాగుతున్నప్పటికీ హఠాత్తుగా వేగం పుంజుకోవడం ఆగమేఘాల మేద ఈడీ డి.కె.శివకుమార్కు సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ దాడి అనంతరం డి.కె.శివకుమార్ వద్ద రూ.300 కోట్లకు పైగా లెక్కలు చూపని ఆస్తి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. గత మార్చిలో డి.కె.శివకుమార్కు చెందిన రూ.75 కోట్ల ఆస్తిని ఐటి శాఖ అటాచ్ చేసింది.
అలాగే డి.కె.శివకుమార్ తల్లి గౌరమ్మ పేరుతో ఉన్న రూ.500 కోట్లు విలువ చేసే ఆస్తిని కూడా ఐటి శాఖ అటాచ్ చేసుకొంది. ఈ దాడుల అనంతరం ఐటి శాఖ డి.కె.శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం మూడు కేసులు దాఖలు చేసింది. ఎఐసిసికి డి.కె.శివకుమార్ అప్పట్లో రూ.5 కోట్లను విరాళంగా చెల్లించినట్లు కూడా ఐటి కేసులో ప్రస్తావించడం గమనార్హం. ఒకవేళ హవాలా ద్వారా ఏఐసీసీ ఈ మొత్తాన్ని అందుకుందన్న విషయం రుజువైతే పార్టీ హైకమాండ్ కూడా చిక్కుల్లో కూరుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు రోజులుగా డి.కె.శివకుమార్ను అన్ని కోణాల నుంచి జెల్లెడ పడుతున్న ఈడీ అధికారులకు ఇప్పటికే కొంత కీలక సమాచారం దక్కినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కేసులో ఒక వేళ డి.కె.శివకుమార్ అరెస్ట్ అయితే కన్నడ నాట కాంగ్రె్సతో పాటు అటు హైకమాండ్కు గట్టి దెబ్బ తగిలినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..శివకుమార్కు ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. కాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న డి.కె.శివకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును చట్టపరంగా తాను ఎదుర్కొంటానని భయపడే ప్రశ్నే లేదని స్పష్టం చేయడం గమనార్హం. తన తల్లి గౌరమ్మ పేరుతో ఉన్న ఆస్తులన్ని కష్టార్జితమని ఆయన మరోమారు స్పష్టం చేశారు. కాగా ఈడీ కబంధ హస్తాల్లో కూరుకుపోవడంతో బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఢిల్లీలోనే ఉన్న డి.కె.శివకుమార్ సోదరుడు, లోక్సభ సభ్యుడు డి.కె.సురేష్ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని కుటుంబ సభ్యులకు చేరవేస్తూ ధైర్యం చెబుతున్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులను సైతం ఢిల్లీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.
WhatsApp us