దిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు నిరాశే ఎదురైంది. ఈ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మరోవైపు చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని దిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేదు. ఈ రోజు ఉదయం మరోసారి వెళ్లగా.. అప్పుడు కూడా చిదంబరం అందుబాటులో లేరు. దీంతో ఆయన ఆచూకీ కనుగొనేందుకు ఈడీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ముందస్తు బెయిల్పై అత్యవసర విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు పిటిషన్ను తీసుకెళ్లాలని చిదంబరరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. సీజేఐ గొగొయి అయోధ్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభించడంతో సిబల్ పిటిషన్ దాఖలు చేయలేకపోయారు. దీంతో చిదంబరాన్ని ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
