ఇంటర్నెట్ డెస్క్: జాబిల్లిపై కాలు మోపే దిశగా విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్-2లోని ల్యాండర్ ‘విక్రమ్’ కక్ష్య తగ్గింపును రెండోసారి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున 3:42గంటలకు పూర్తి చేశారు. దీనికోసం ల్యాండర్లోని చోదక శక్తిని 9సెకన్లపాటు మండించారు. దీంతో చంద్రుడిపై చరిత్రాత్మక ల్యాండింగ్కి విక్రమ్ అత్యంత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ 35 కిలోమీటర్లుx 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉండగా.. ఆర్బిటర్ 96 కి.మీx 125కి.మీ కక్ష్యలో కొనసాగుతోంది. ప్రస్తుతం ల్యాండర్, ఆర్బిటర్ల పనితీరు భేషుగ్గా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. మిగిలిన రెండు రోజుల పాటు ల్యాండర్, రోవర్లోని వ్యవస్థల పనితీరును ఇస్రో పరిశీలిస్తుంది. 6న అర్ధరాత్రి దాటాక 1.30-2.30 గంటల మధ్య.. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో కాలుమోపుతుంది. కొద్దిగంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వస్తుంది.
చంద్రయాన్-2 జాబిల్లి చుట్టూ 119 కిలోమీటర్లు× 127 కిలోమీటర్ల కక్ష్యలో ఉండగా సోమవారం మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు సంకేతాలు పంపి, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ను విడిపోయేలా చేశారు. మంగళవారం ఉదయం 8.50 గంటలకు ల్యాండర్లోని చోదక వ్యవస్థను నాలుగు సెకన్ల పాటు మండించి దాని కక్ష్యను తగ్గించారు.
