పుల్వామాదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో భారత వాయుసేన బాలాకోట్లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఇండియన్ ఎయిర్ఫోర్స్ విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా వీడియోను రిలీజ్ చేశారు.
మొత్తం ఒక నిమిషం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిబిరాలపై బాంబులను జారవిడిచి ఆ శిబిరాలను ధ్వంసం చేయడం కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధ విమానాలు బాలాకోట్ ఆపరేషన్స్లో పాల్గొన్న మిరాజ్ -2000 ఫైటర్ జెట్లా కాదా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. ఫిబ్రవరి 26న మిరాజ్-2000 యుద్ధ విమానాలు దేశంలోని పలు ఎయిర్బేస్ల నుంచి టేకాఫ్ తీసుకుని బాలాకోట్పై మెరుపు దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లో బాలాకోట్ ఉంది.
ఫిబ్రవరి 14వ తేదీన ఇండియన్ ఎయిర్ఫోర్స్ పుల్వామా దాడులకు ఎలా ప్రతీకారం తీర్చుకుందో వీడియోలోని వాయిస్ ఓవర్లో వినిపిస్తుంది. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. వాయిస్ ఓవర్తో పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన పైలట్లు ఒక గదిలో మాట్లాడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి.ఆ తర్వాత మిరాజ్-2000 యుద్ధ విమానాల దగ్గరకు పైలట్లు పరుగులు తీసే దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్, కంట్రోల్ సెంటర్లు, లక్ష్యాలను టార్గెట్ చేస్తున్న రేడార్లు వంటి విజువల్స్ కనిపిస్తాయి.
అంతేకాదు ఫిబ్రవరి 27న భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన చిన్నపాటి డాగ్ ఫైట్ కూడా వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మిగ్ -21 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. రన్వే నుంచి టేకాఫ్ తీసుకునే దృశ్యాలు కూడా కనిపించాయి. ఈ డాగ్ ఫైట్లోనే అభినందన్ వర్థమాన్ కమాండ్ చేస్తున్న యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలడం, ఆయన సురక్షితంగా బయటపడి, పాక్ సైన్యం చేతులకు చిక్కడం జరిగాయి. ఈ వీడియో చూస్తున్న వారికి రోమాలు నిక్కపొడుచుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు.
