జమ్ము/హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేసిన మోడీ, అక్కడ పాగా వేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జమ్ముకాశ్మీర్ యువతను సన్మార్గంలో నడిపించేందుకు, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచడానికి జమ్ముకాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం ఒకటి తీసుకున్నారు. యువతకు మెరుగైన జీవనోపాది కల్పించడం ద్వారా వారిని తీవ్రవాదం వైపు నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్యోగాలు ఎరగా వేయాలని నిర్ణయించిన కేంద్రం, ఒకేసారి 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తోంది.
ఒక ప్రాంతంలో ఇన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవడం చాలా అరుదైన విషయంగా చర్చ జరుగుతోంది. చెడు మార్గంలో పయనిస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని, అదే ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జీవితానికి భద్రత ఉంటుందనే సంకేతాలను యువతకు బలంగా ఇచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది.
అంతే కాకుండా కొంచెం జాగ్రత్తపడి చదివితే, ఒక్క మూడు నెలలు కష్ట పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సెటిలైపోవచ్చు అన్న మంచి సందేశంతో, ఆవేశాలను చల్లార్చి ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చేస్తోంది కేంద్రం. స్థానిక యువతలో ఈ నిర్ణయం ద్వారా కొత్త ఆశలు చిగురింపజేసి వారిలో అనూహ్య మార్పుతీసుకు వచ్చేందుకు మోదీ సర్కార్ వినూత్నంగా అడుగులు వేస్తోంది. ఈ నోటిఫికేషన్ గురించి గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు.
ఇదే అంశంలో మరో సంచలనం అంశం దాగుందని, త్వరలోనే జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేయనుందని, సమీప భవిష్యత్తులో ఆ వివరాలు తెలుస్తాయని అన్నారు. జమ్మూకశ్మీర్ ఉనికి, సంస్కృతికి యతాతథంగా కాపాడుతామని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలు కేవలం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే నిలుపుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమయంలో వీటి సేవలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తారని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనేదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, పరిస్థితులు సర్దుమనిగాక అన్ని సౌకర్యాలను పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
