న్యూఢిల్లీ : జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ తాజాగా హెచ్చరిక లేఖ రాశారు. భారతదేశంలోని రేవారి రైల్వే జంక్షన్తోపాటు పలు దేవాలయాలను పేల్చి వేస్తామని హెచ్చరిస్తూ హిందీ భాషలో రాసిన లేఖ హర్యానా రాష్ట్రంలోని రోహతక్ రైల్వే పోలీసులకు ఆర్డినరీ పోస్టులో వచ్చింది. హర్యానా రాష్ట్రంలోని రేవారీ రైల్వే జంక్షన్ తోపాటు పలు దేవాలయాలను పేల్చి వేస్తామని మసూద్ అజహర్ తన లేఖలో హెచ్చరించారు.
ఈ లేఖతో హర్యానా పోలీసులు అప్రమత్తమయ్యారు. రేవారి రైల్వేస్టేషనులో సాయుధ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారతదేశంలోకి వచ్చి దాడులు చేసేందుకు శిక్షణ పొందారని అందిన నిఘా వర్గాల సమాచారంతో భారత నావికాదళం అప్రమత్తమైంది. 50 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు శిక్షణ పొంది భారత్ పై దాడులకు సిద్ధమయ్యారని అందిన సమాచారం మేర బీఎస్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి.
