న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైందా? ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్ర పంజా విసిరేందుకు కుట్రలు పన్నిందా? అంటే భారత ఆర్మీ ఉన్నతాధికారులు అవుననే జవాబు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని తమకు నిఘా సమాచారం అందిందని ఆర్మీ సదరన్ కమాండ్ కు చెందిన లెఫ్లినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు. భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు.
ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2008, నవంబర్ 26న ఇదే తరహాలో సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు మహానగరంలో మారణహోమం సృష్టించారు. ఈ దుర్ఘటనలో 140 మంది భారతీయులు, 25 మంది విదేశీ టూరిస్టులతో పాటు 9 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. భారత్ ఏకైక ఉగ్రవాది కసబ్ ను సజీవంగా పట్టుకోవడంతో పాక్ నీచబుద్ధి ప్రపంచానికి తెలిసింది.
