తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరుబావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 25న ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన సుజిత్ 56 గంటలుగా అందులోనే ఉన్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్కు చెందిన నిపుణులతో పాటు ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
చిన్నారి పడిన బోరుబావి వద్దకు చేరుకున్న ఐదుగురు తమిళనాడు మంత్రులు, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రస్తుతం బాలుడు 88 అడుగుల లోతులో ఉన్నాడని, మరింత లోతుకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నట్టు తెలిపారు.మరోవైపు, బాలుడు బయటకు రావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సుజిత్ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు.
