మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో నిన్న నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..దురదృష్టవశాత్తు దేశంలో ఆవు పేరును వింటేనే కొందరు వణికిపోతున్నారని మోడి వ్యంగ్యంగా అన్నారు. ఆవు, ఓం పేర్లను వింటుంటే దేశం 16వ శతాబ్దానికి వెళ్లిపోయినట్టుగా భావిస్తున్నారని అన్నారు. ఆవు విషయంలో ఆఫ్రికాలోని రువాండా దేశం అనుసరిస్తున్న విధానాలు తనను ఆకర్షించాయన్నారు. అక్కడ ప్రభుత్వమే ప్రజలకు ఆవులను అందజేసే కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఆవులు లేని వారికి వాటిని ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తోందన్నారు. పశువుల్లో వ్యాపించే ఫుట్ అండ్ మౌత్ వ్యాధితోపాటు బ్రెసెల్లోసిస్ వ్యాధుల నివారణకు సంబంధించి జాతీయ పశువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
