ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.. రెండు రోజుల పర్యటన కోసం సౌదీకి వెళ్తున్నారు మోడీ. అంతర్జాతీయ బిజినెస్ ఫోరమ్లో పాల్గొనడంతో పాటు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదీతో ఆయన సద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం కీలక ప్రసంగం చేయనున్నారు. సౌదీ పర్యటనలో భాగంగా రూపే కార్డును విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ. హజ్ యాత్రకు సౌదీ వెళ్లే భారతీయులకు రూపే కార్డు ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాల్లో యూఏఈ, బెహ్రెయిన్ తర్వాత రూపే కార్డు సౌకర్యం అందుబాటులోకి రానున్న దేశం కానుంది సౌదీ అరేబియా. సౌదీ యువరాజుతో జరిగే భేటీలో 13 కీలకమైన అంశాలపై చర్చించనున్నరు భారత్ ప్రధాని. 2016లో మొదటిసారిగా సౌదీలో పర్యటించిన ప్రధాని మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు.
మరోవైపు… పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సౌదీ పర్యటనకు వెళ్తున్న భారత్ ప్రధాని మోడీ విమానం తమ గగనతలం మీదుగా ప్రయాణించడానికి అనుమతి నిరాకరించింది. గత నెల అమెరికా పర్యటన సమయంలోనూ పాక్ తమ గగనతలం నుంచి ప్రధాని మోడీ విమాన ప్రయాణానికి అనుమతించలేదు. అంతకు ముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐస్ల్యాండ్ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత కొద్దికాలం గగతనలాన్ని మూసివేసిన పాక్… అనంతరం తెరిచింది. అయితే, జమ్మూ-కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేసింది.
