ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) సందర్భంగా ఇవాళ ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకోనుంది. యూఎన్జీఏని ఉద్దేశించి భారత్, పాకిస్తాన్ ప్రధానులిద్దరూ వెంటవెంటనే ప్రసంగించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏడవ స్పీకర్గా మాట్లాడనున్నారు. ఆ వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు. యూఎన్జీఏలో దాయాది దేశాల అధినేతలిద్దరూ ఒకరితర్వాత ఒకరు వరుసగా ప్రసంగించడం చాలా అరుదు. స్థానిక కాలమానం ప్రకారం యూఎన్జీఏ సమావేశం ఉదయం 9 గంటలకు (భారత్లో సాయంత్రం 6:30) ప్రారంభం అవుతుంది. వివిధ దేశాలకు చెందిన ఆరుగురు దేశాధినేతలు ప్రసంగించిన తర్వాత మోదీ వంతు రానుంది.
ప్రధాని మోదీ ప్రసంగాన్ని సాయంత్రం 8:30-9:00 మధ్య డీడీ న్యూస్ సహా ప్రముఖ వార్తా చానెళ్లలో ప్రసారం చేస్తారని సమాచారం. మోదీ ప్రసంగం పూర్తికాగానే ఇమ్రాన్ మాట్లాడనున్నారు. పీటీవీ సహా పాకిస్తాన్లోని ప్రముఖ వార్తా చానెళ్లు ఆయన ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నాయి. కాగా ఇమ్రాన్ ప్రసంగం ప్రత్యేకించి కశ్మీర్ కేంద్రంగా సాగుతుందని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ దాదాపు అన్ని ద్వైపాక్షిక సమావేశాల్లోనూ కశ్మీర్ గురించే మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాగా ప్రధాని మోదీ ప్రాంతీయ అభివృద్ధి, శాంతి ప్రధాన అంశాలుగా ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణతో పాటు అంతర్జాతీయ సమస్యలైన ఉగ్రవాదం, పర్యావరణ మార్పులు తదితర అంశాలపై ప్రధాని మాట్లాడనున్నట్టు భావిస్తున్నారు.
