పాపికొండల పర్యటన ప్రాణాంతకంగా మారటం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పెను ప్రమాదం తర్వాత సాగుతున్న మృతదేహాల వెలికితీత కూడా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
దశాబ్దాలుగా నదీ ప్రయాణాలు సాగుతున్నా అవి సురక్షితంగా సాగటానికి నేటికీ పటిష్టమైన చర్యలు లేవనే అభిప్రాయం వినిపిస్తోంది.
గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన టూరిస్టు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం స్పందించింది. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తామని చెప్తోంది.
అయితే, గతంలో ఇటువంటి ప్రమాదాల మీద జరిగిన విచారణలు ఏం చెప్పాయి? వాటి మీద తీసుకున్న చర్యలేమిటి? ఆ చర్యలు ఎంత వరకూ ఫలించాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
