భారత్-అమెరికా ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఈ ఏడాది చివరి నాటికి 18బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్ శనివారం ప్రకటించింది. వచ్చే వారం ‘భారత్-అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య కార్యక్రమం'(డీటీటీఐ) తొమ్మిదో సమావేశం దిల్లీలో జరగనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం పెంపొందించుకుంటూ భారత్తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని పెంటగాన్కు చెందిన ఉన్నతాధికారి ఎలెన్ ఎమ్ లార్డ్ అన్నారు. దిల్లీలో జరగనున్న సమావేశానికి ఎలెన్తో పాటు మరో ఉన్నతాధికారి అమెరికా తరఫున హాజరుకానున్నారు. గత ఆగస్టులో ఇరు దేశాల మధ్య జరిగిన ‘డిఫెన్స్ పాలసీ గ్రూప్’ సమావేశం తరవాత భారత్కు స్ట్రాటజిక్ ట్రేడ్ అథారిటీ టైర్-1 హోదా కల్పించామని గుర్తుచేశారు. దీని వల్ల క్రమబద్ధీకరించిన ప్రక్రియ ద్వారా అమెరికాకు చెందిన కంపెనీలు ద్వంద్వ వినియోగ, అధునాతన పరికరాలను భారత్కు అందించే వెసులుబాటు కలిగిందన్నారు. దీంతో నాటో గ్రూప్లోని జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియాతో సమానంగా భారత్కు హోదా కల్పించినట్లయిందన్నారు. అలాగే గత జూన్లో భారత్తో సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా నాటో గ్రూప్లోని సౌత్ కొరియా, ఇజ్రాయెల్తో సమాన హోదా కల్పించాలని సెనెట్లో లెజిస్లేటివ్ ప్రొవిజన్ పాస్ అయ్యిందన్నారు. ఈ పరిణామాలన్నీ ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ఆశయాలను సూచిస్తున్నాయన్నారు. అలాగే ఇరు దేశాల్లో రక్షణ పరికరాలు, ఆయుధాల తయారీకి గల సామర్థ్యాల్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు.
