న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను నిన్న సిబీఐ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను కొందరు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఆయనను ఉంచారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్ పూర్తయింది. రెండో రౌండ్ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఇంద్రాణీ ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన రిమాండ్కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది.
